ఓ సినిమా తీసి, థియేటర్లో విడుదల చేయడం.. సీట్లో కూర్చొని చూసినంత సులభం కాదు. క్లాప్ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టి, విడుదల చేసే వరకూ ఎన్నో వివాదాలు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దర్శక, నిర్మాతల్ని అనేక ఒత్తిళ్లు చుట్టుముడుతుంటాయి. ఈ ఏడాది పలు సినిమాలు వివాదాల్లో చిక్కుకుని.. చివరికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 2019లో కథ, నటీనటులు, టైటిల్స్... ఇలా వివిధ అంశాల్లో కష్టాలు ఎదురొడ్డి ఎట్టకేలకు నిలదొక్కుకున్న చిత్రాలు చాలానే ఉన్నాయి. హాట్ టాపిక్లుగా మారి, ఆసక్తిని పెంచాయి. అలాంటి వాటిని ఓసారి గుర్తు చేసుకుందాం..
టైటిల్ నుంచి కథ వరకు..
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీసిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాకు మొదట 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అనే టైటిల్ పెట్టారు. కానీ వ్యతిరేకత రావడంతో 'సైరా'గా మార్చారు. ఆపై ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు చిత్ర బృందంపై కేసు పెట్టారు. నిర్మాతలు కథ విషయంలో ఒప్పందం చేసుకుని, మోసం చేశారని ఆరోపించారు. డబ్బులు ఇస్తామని చెప్పి, ఇప్పుడు మాట తప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోపక్క ఉయ్యాలవాడ కుటుంబానికి చెందిన మరికొందరు కథానాయకుడు చిరంజీవిని కలిసి, సినిమా తీయడంపై ఆనందం వ్యక్తం చేశారు. చివరికి ఈ చిత్రం విడుదలై ప్రశంసలు పొందడంతోపాటు బాక్సాఫీసు వసూళ్లు రాబట్టింది.
ఎన్నికలు అయ్యాకే..
అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవితానికి సంబంధించిన మరో కోణం అంటూ ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ తీసిన సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. తొలిరోజు నుంచే ఈ చిత్రాన్ని వివాదాలు చుట్టుముడుతూనే వచ్చాయి. ఈ సినిమా విడుదలపై తెదేపా కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమా తెలంగాణలో సజావుగా విడుదలైనప్పటికీ.. ఏపీలో మాత్రం వాయిదా పడింది. ఏపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సినిమాను విడుదల చేయడం సబబు కాదని పలువురు తెదేపా కార్యకర్తలు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో.. విడుదలను నిలిపివేయాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. దీంతో వర్మ సినిమాను వాయిదా వేసి, విడుదల చేశారు. అదేవిధంగా వర్మ దర్శకత్వంలో ఈ ఏడాది వచ్చిన 'అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు'ను కూడా వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా టైటిల్ను కూడా మార్చారు. సినిమాకు వ్యతిరేకంగా కొందరు కోర్టులో కేసు కూడా వేశారు. చివరికి కొన్ని మార్పులతో చిత్రం విడుదలైంది.
'ఇస్మార్ట్' కథ..